గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠాలోని ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, రూ. 37 లక్షలు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠాలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9న రాత్రి రూ.1.07 కోట్లు చోరీ చేసిన ముఠాలోని ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 37 లక్షలు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా కాలేజీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ ఇద్దరు పాత నేరస్థులే. హైదరాబాద్లో కాలేజీలను దోచేందుకు స్కెచ్ వేశారు. దొంగత నం చేసిన వారంతా బంధువులే కావడం గమనార్హం. వీళ్లంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాలకు చెందినవారు. వారంతా అప్పుడప్పుడు గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని ఉమర్గం గ్రామంలో కలిసితిరుగుతుండేవారు. గుజరాత్కు చెందిన దినేశ్ మొహితే, మధ్యప్రదే శ్కు చెందిన అరుణ్ మొహితేలు ఈ దొంగతనం ప్లాన్లో కీలకంగా వ్యవహారించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
రోజంతా..జూ పార్కులోనే..
గుజరాత్ నుంచి వచ్చిన ఈ దొంగల ముఠా సభ్యులు అమీర్పేట్లో బస్సు దిగి అక్కడి నుంచి లింగంపల్లి వెళ్లి అక్కడే స్నానాలు పూర్తి చేసుకున్నారు. రాత్రి వరకు సమయం ఎక్కడ గడపాలని నెట్లో సర్చ్ చేశారు. జూ పార్కులో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడుపొచ్చని ప్లాన్ చేసి లింగంపల్లి నుంచి ఆటోలో జూపార్కుకు వెళ్లారు. అక్కడ జూపార్కులోనే సాయంత్రం వరకు గడిపారు. జూపార్కు నుంచి శివారులో ఉన్న కాలేజీలను గూగుల్ మ్యాప్స్లో పరిశీలించి, నాగోల్ ప్రాంతంలో ఉన్న శ్రేయా కాలేజీకి వెళ్లి అక్కడ చుట్టు పక్కల ఇండ్లు ఉండడంతో దొంగతనం చేయడం కష్టమని భావించారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బాటసింగారం ప్రాంతంలో ఉన్న బ్రిలియంట్ కాలేజీ వద్దకు అర్ధరాత్రి వెళ్లారు. అక్కడ కాలేజీలో దొంగతనం చేసి అక్కడి నుంచి కూడా ఎల్బీనగర్ వరకు గూగుల్ మ్యాప్స్తోనే వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఊహించని డబ్బుతో..!
సాధారణంగా కాలేజీల్లో రూ. 10 లక్షల లోపు డబ్బు దొరకడం కష్టంగా ఉంటుంది. అనుకోకుండా బ్రిలియంట్ కాలేజీలో కోటి రూపాయలు లభించడంతో దొంగలు అంత డబ్బును ఉహించలేదు. దీంతో రాత్రికి రాత్రే హైదరాబాద్ను వదిలేసి పోవాలని నిర్ణయించారు. డబ్బు చేతిలో ఉండడం తో క్యాబ్లో నాగార్జునసాగర్ వరకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో ఇతర ప్రాంతాలకు ప్రయాణించారు. మరుసటిరోజు కాలేజీ తెరిచి బాధితులు దొంగతనం జరిగిందని గుర్తించేవరకు దొంగలు రాష్ట్రం వదిలేసి వెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగేవరకు ఏపీని కూడా దాటేసి పోయారు. దీంతో పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకోవడానికి నెలరోజులకుపైగా పట్టింది. దొంగలను గుర్తించేందుకు పోలీసులు బ్రిలియంట్ కాలేజీకి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను విశ్లేషించారు.
ఈ కెమెరాల్లో 9వ తేదీ రాత్రి అనుమానాస్పదంగా కన్పించిన వాహనాలు, మనుషులను ఆరా తీడయం తో కొన్ని ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలతో నిందితు లు అంతర్రాష్ట్ర ముఠా అని గుర్తించి ఇద్దరిని పట్టుకున్నారు. దొంగలకు ఉహించని డబ్బు రావడంతో కొందరు బెట్టింగ్లలోను పెట్టుబడులు పెట్టారు. ఇలా హైదరాబాద్పై పూర్తి అవగాహన లేకున్నా, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నిర్జన ప్రదేశాల్లోని కాలేజీలను గుర్తించి అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.