కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 16: నిరుద్యోగులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జాబ్మేళా వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలను జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నెట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను వీసీ కట్టా నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువులు పూర్తయిన నిరుద్యోగులు నిత్యం కొత్త అంశాలను నేర్చుకోవాలని.. ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడే లోపాలు తెలుస్తాయన్నారు. వర్సిటీలో జాబ్మేళాలు నిర్వహిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు 65వేల మంది జాబ్మేళాలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ జాబ్మేళాలో మహేంద్ర కాగ్నిట్ లాంటి ఐటీ కంపెనీలు రెడ్డిస్, అరబిందో, హెటిరో లాంటి ఫార్మా కంపెనీలు, ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంకు, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వంద సంస్థలు హాజరుకాగా సుమారు 10వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సేవా ఇంటర్నెట్ సంస్థ వ్యవస్థాపకురాలు సుభద్రారాణి, యూఐఐసీ డైరెక్టర్ తారాకల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ సురేశ్కుమార్, పీఆర్వో ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.