సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నగర ప్రజల భద్రతను గాలికొదిలేసి, కేవలం ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోర్డింగ్లు కూలి సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఉదంతాలను మర్చిపోయి, మళ్లీ భారీ హోర్డింగ్లకు అనుమతులు ఇచ్చేందుకు సరార్ సిద్ధం కావడంపై పౌర సమాజం మండిపడుతున్నది. 15 అడుగుల ఎత్తు నిబంధనను ఎత్తివేస్తూ రెండు రోజుల క్రితం కేబినెట్ తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద ఎత్తున కార్పొరేట్ లాబీయింగ్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘టార్గెట్’గా చేసుకుని నూతన ప్రకటనల పాలసీని తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతున్నది. ఇప్పటికే జీవో నంబరు 68ను తుంగలో తొక్కిన సర్కారు నూతన ప్రకటనల పాలసీ పేరుతో పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టి ట్రై కార్పొరేషన్లలో కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ప్రకటనల ఆదాయం వెళ్లేలా ‘మాస్టర్ స్కెచ్’ వేసి.. ఇందుకు తగ్గట్టుగా ‘టార్గెట్’ను ఖరారు చేశారు. ముఖ్య నేత బంధువులు, అనుచరుల చేతుల్లో యూనిఫోల్స్ (హోర్డింగ్లు) పెట్టి అక్రమార్జనకు మార్గం సుగమం చేశారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) ముసుగులో మల్టీ లెవల్ కారు పార్కింగ్ పేరుతో యూనిఫోల్స్, (ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్వోబీ), స్మార్ట్ ఫోల్స్ (రోడ్డు మధ్యలో పెట్టే క్యాండిలివర్స్)లు ఇలా మూడు నగర పాలక సంస్థల పరిధిలోని కీలక ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థలకే కట్టబెట్టేందుకు చకచకా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాలసీతో ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటూనే..ఈ ముసుగులో తమ అనుకూల వ్యక్తులకు లాభం చేకూరేలా పాలసీ ఉండనుందన్న ప్రచారం సాగుతున్నది. అన్నింటి కంటే భారీ హోర్డింగ్లతో ప్రజల భద్రత గాలిలో దీపంలా మారనుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
గతంలో ప్రాణనష్టం.. : గతంలో బలమైన గాలులకు భారీ యూనిపోల్స్, హోర్డింగ్లు కూలి ప్రాణనష్టం జరగడంతో ప్రజల భద్రత దృష్ట్యా 15 అడుగుల కంటే ఎకువ ఎత్తు ఉండకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తెచ్చారు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ (ప్రైవేట్ పార్టనర్ షిప్) పేరుతో ఆ నిబంధనలను తుంగలో తొకుతోంది. గాలివేగం, నిర్మాణ స్థిరత్వం వంటి అంశాలను కేవలం కాగితాలకే పరిమితం చేసి, భారీ ప్రకటనల బోర్డులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలకు మేలు చేసేందుకే ఈ కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీని రూపొందించినట్లు తెలుస్తోంది. పీపీపీ విధానం ద్వారా చిన్న ఏజెన్సీలను దెబ్బకొట్టి, కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలకే నగర పాలక సంస్థలను ధారాదత్తం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నగరమంతా ఎల్ డీ బోర్డుల హోరుతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు భారీ హోర్డింగ్ ల వల్ల ప్రమాదాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
మార్గదర్శకాలపై కసరత్తు… : కొత్త అడ్వర్టైజ్ మెంట్ పాలసీని అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో మార్గదర్శకాల రూపకల్పనపై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అడ్వర్టజ్మెంట్ యునిపోల్స్, హోర్డింగ్లున్నా, వాటిని వినియోగించటం లేదు. ఈ సరికొత్త పాలసీ ప్రకారం సిటీలోని అన్ని ప్రాంతాల్లో కాకుండా వ్యాపార కేంద్రాలున్నా ప్రాంతాలతో పాటు జన సంచారమెకువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి, అడ్వర్టైజ్ మెంట్లను అనుమతించనున్నారు.
కానీ ఈ కొత్త పాలసీలోని అంశాల ప్రకారం మున్ముందు సిటీలోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాలు, ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న హోర్డింగ్లు, యునిపోల్స్లను యాక్షన్ నిర్వహించి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసే అడ్వర్ టైజ్ మెంట్లకు సంబంధించి అవి కావల్సిన వారు దరఖాస్తు చేస్తే, టెండర్ ప్రక్రియ ద్వారా వాటిని కేటాయించనున్నట్లు సమాచారం. కమర్షియల్ ఏరియాలు, సెమీ కమర్షియల్ ఏరియాలు, రెసిడెన్షియల్ ఏరియాలను బట్టి ఏర్పాటు చేయనున్న అడ్వర్ టైజ్ మెంట్ సైజును బట్టి చదరపు అడుగుకు రేట్లను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. వీటి కేటాయింపునకు సంబంధించిన స్పెషల్ సీఎస్ అన్ని రకాలుగా అధికారాలను కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం.
మొత్తం ఏర్పాటు చేయాలని భావిస్తున్న అడ్వర్ టైజ్ మెంట్లలో దాదాపు పది శాతం అడ్వర్ టైజ్ మెంట్లను సరారుకు అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసుకునేందుకు వీలుగా కేటాయింపులు జరపనున్నట్లు తెలిసింది. అయిదేళ్లకు కేటాయింపు..: జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అడ్వర్ టైజ్ మెంట్ ప్రకారం హోర్డింగ్లను, యునిపోల్స్లను ఏడాదికోసారి కేటాయింపులు జరిపేవారు. కానీ త్వరలో అమల్లోకి రానున్న సరి కొత్త పాలసీ ప్రకారం ఒకో అడ్వర్ టైజ్ మెంట్, యునిపోల్స్, హోర్డింగ్లను ఏకంగా అయిదేళ్లకు కేటాయించేలా మార్గదర్శకాలున్నట్లు సమాచారం. అయిదేళ్లు అడ్వర్ టైజ్ మెంట్ వినియోగానికి గాను కేటాయింపు జరిపే సమయంలో ఏడాది చార్జీలు ముందుగానే జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేసేలా సరి కొత్త పాలసీలో నిబంధనలు ఉండనున్నట్లు తెలిసింది.