అబిడ్స్ / మెహిదీపట్నం / కార్వాన్, జూలై18 : గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం మూడో బోనం పూజ సందర్భంగా కోటలో భక్తుల సందడి నెలకొన్నది. కోటలో పటాలను గీసిన భక్తులు బోనాలను తయారు చేసుకుని ఊరేగింపుగా జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు వెళ్లి అక్కడ అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పించారు. శాంతిభద్రతలకు ఇబ్బందులు కలుగకుండా జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు, అదనపు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్ పర్యవేక్షించారు. ఏసీపీ కోటేశ్వర్ రావు, ఇన్స్పెక్టర్లు శంకర్రెడ్డి, సుధీర్కుమార్ ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూశారు.
పురానాపూల్లో తొట్టెల ఊరేగింపు సందర్భంగా అమ్మవారి ఆలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందడి అంజన్కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్గౌడ్, సంఘ సేవకులు భీష్మ, టీఆర్ఎస్ నాయకుడు సందీప్గౌడ్, కాంగ్రెస్ నాయకుడు బాబు పూజలు చేశారు. పురానాపూల్ నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపు గోల్కొండ కోట వరకు సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు భీష్మ అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దుర్గరాజ్, బాబు, అర్జున్సింగ్, రామ్త్రన్ పాల్గొన్నారు. గోల్కొండలోని అమ్మవారి ఆలయంలో టీఆర్ఎస్ నాయకుడు సురేశ్ ముదిరాజ్ వారి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సబ్జీమండి నుంచి కార్వాన్, లంగర్హౌస్ల మీదుగా గోల్కొండ కోటకు పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఉత్సాహంగా తరలివెళ్లి ఆమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎం. స్వామియాదవ్, కుల్సుంపురా ఇన్స్పెక్టర్ శంకర్ను గంగపుత్ర సంఘం ప్రతినిధులు సన్మానించారు.