కంటోన్మెంట్, సెప్టెంబర్ 23 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కార్ఖానాలోని దివంగత ఎమ్మెల్యే సాయన్న నివాసంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్యనందిత నేతృత్వంలో నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, ముఖ్య నేతల సమావేశానికి ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… రానున్న రెండు నెలలు బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. అన్నివర్గాల ప్రజల దీవెనలతో లాస్యనందిత విజయభేరి మోగించడం ఖాయమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కంటోన్మెంట్ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు.
కంటోన్మెంట్లో పదిరోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని, సాయన్న కృషితోనే ఉచిత మంచినీటి పథకం కంటోన్మెంట్లో అమలవుతున్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ప్రతిపక్షాల చౌకబారు విమర్శలు, అసత్య ప్రచారాలకు ఎక్కడా కుంగిపోకుండా మనమంతా చేసిన ప్రగతితోనే వారికి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో నేటి నుంచి వరుసగా భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందితతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, శ్యాంకుమార్, లోకనాథంతో పాటు సీనియర్ నాయకులు పెద్దాల నర్సింహ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కీలక భేటీకి సంబంధించి దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీతతో పాటు మహిళా నాయకురాలు నివేదిత చేసిన కృషితో ముఖ్య నేతలంతా ఒక్క తాటిపైకి రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది.