బంజారాహిల్స్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): దేశ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ వయస్సు గల 18 నెలల చిన్నారి (బాలుడి)కి నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎక్మో చికిత్స అందించి రికార్డు సృష్టించింది. 29 రోజుల పాటు చిన్నారికి విజయవంతంగా ఎక్మో చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు రెయిన్బో వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం బంజారాహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఎండీ డా.రమేష్ కంచర్ల, ఇంటెన్సీవ్ కేర్ విభాగం డైరెక్టర్ డా.దినేష్ చీర్ల వివరాలు వెల్లడించారు. గోవాకు చెందిన 18నెలల చిన్నారి బాలుడు ‘ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్’ (ఏడీఆర్ఎస్)తో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు స్థానిక హాస్పిటల్లో చేర్పించారు.
హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్తో పాటు 100 శాతం ఆక్సిజన్, హెచ్ఎఫ్వోవీ సాయంతో వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ చిన్నారి బాలుడు ఆక్సిజన్ను తీసుకోలేకపోయాడు. దీంతో అక్కడి వైద్యుల సూచన మేరకు చిన్నారి తల్లిదండ్రులు రెయిన్బో హాస్పిటల్ను ఆశ్రయించారు. ఈ మేరకు రోగి వైద్య పరీక్షలను పరిశీలించిన రెయిన్బో వైద్యులు చిన్నారికి ఎక్మో చికిత్స అందించాలని నిర్ణయించారు. వెంటనే నగరం నుంచి గోవాకు చేరుకున్న రెయిన్బో వైద్యులు అక్కడి దవాఖానలో చిన్నారి బాలుడికి ఎక్మో చికిత్స ప్రారంభించి, ఎయిర్ అంబులెన్స్ ద్వారా నగరానికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో రోగికి 29 రోజుల పాటు ఖచ్చితమైన ప్రణాళిక, 100 శాతం ఇన్ఫెక్షన్ కంట్రోల్ తదితర పకడ్బందీ వైద్య పద్ధతులతో విజయవంతంగా ఎక్మో చికిత్స అందించి, బాలుడి ప్రాణాలను కాపాడగలిగామని డా.దినేష్ చీర్ల తెలిపారు. ప్రస్తుతం చిన్నారి బాలుడు పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డా.కపిల్, డా.ఫర్హాన్ షేక్, డా.అనుపమ ఎర్ర పాల్గొనారు.
శేరి లింగంపల్లి, అక్టోబర్ 27: స్వైన్ ఫ్లూ, న్యూమోనియాతో దవాఖానలో చేరిన ఏడాది వయసు కూడా లేని ఓ పసిపాప ప్రాణాలను గచ్చిబౌలిలోని కిమ్స్ కడిల్స్ వైద్యులు కాపాడారు. ఎక్మో సహాయంతో విజయవంతంగా చికిత్సను అందించారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించి శుక్రవారం గచ్చిబౌలిలోని కిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిడియాట్రిక్ వైద్యులు సుమన్, అలేఖ్యలు వివరాలు వెల్లడించారు. 11 నెలల వయస్సు కలిగిన ఓ చిన్నారికి హెచ్1ఎన్1 న్యూమోనియా సోకింది.
ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేర్పించగా వెంటిలేటర్పై పెట్టి చికిత్సను అందించినా ఫలితం లేకపోవడంతో చివరకు కిమ్స్ కడిల్స్కు తీసుకువచ్చారు. వెంటనే సదరు చిన్నారిని ఎక్మో సహాయంతో 22 రోజులు చికిత్సను అందించి మరో 10 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్సను అందించి ప్రాణాలు కాపాడినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్న వయస్సులో ఎక్మో సహాయంతో చికిత్సను అందించి పాప ప్రాణాలు కాపాడడం అరుదైన చికిత్సగా తెలిపారు. ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుందని, విజయవంతంగా చికిత్స పూర్తయిన అనంతరం, ఆరోగ్యంగా ఉన్నదని పిడియాట్రిక్ వైద్యులు సుమన్, అలేఖ్యలు తెలియజేశారు.