సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): నగరంలో పచ్చదనం పెరిగేలా, కాలనీలన్నీ పచ్చని లోగిళ్లు అయ్యేలా ప్రభుత్వం హరితహారం పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమ పనులను జీహెచ్ఎంసీ, అర్బన్ బయో డైవర్శిటీ విభాగం ఉధృతం చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరి లింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీలలో కోటి మొక్కలను సిద్ధం చేయగా, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరి లింగంపల్లి జోన్లో ఒక్కో జోన్కు 20 లక్షలు, చార్మినార్, సికింద్రాబాద్లో ఒక్కో జోన్కు 14 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 12 లక్షల మొక్కల నాటాలని లక్ష్యంతో రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగానే గ్రీన్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఒక్కో కాలనీని యూనిట్గా తీసుకుని కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రధానంగా కాలనీ రోడ్లలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతున్నారు. యూబీడీ సూపర్వైజర్లు కాలనీ అసోసియేషన్లను భాగస్వామ్యం చేస్తూ పనులు చేపడుతున్నారు. డిసెంబరు నెలాఖరు కల్లా ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇనిస్టిట్యూషన్స్, ఖాళీ స్ధలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు. అంతే కాకుండా ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలను నాటుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రీ పార్కు, ఇతర పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. కోటి మొక్కల లక్ష్యంలో గడిచిన పది రోజులుగా 10 లక్షల మొక్కలను నాటినట్లు యూబీడీ విభాగం అధికారులు తెలిపారు. వీలైన చోట్ల వాకింగ్ ట్రాక్లు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.