బంజారాహిల్స్, మార్చి 23: తనకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో బాలికను కిడ్నాప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన వి.కృష్ణ, సుజాత దంపతులు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో లేబర్గా పనిచేస్తుంటారు. వారి కుమార్తె (12) ఫిలింనగర్లోని రౌండ్టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నది. ఈనెల 12న ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా తమ ఇంటిపక్కన ఉండే సమీప బంధువులైన మల్లేశ్(22) అతడి తల్లి సరోజమ్మ డబ్బుల కోసం తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని బాలిక తండ్రి కృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్నకు రెండురోజుల ముందు మల్లేశ్ తనను రూ.50వేలు అడిగారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే బాలికను కిడ్నాప్ చేశారని, సీసీ ఫుటేజీలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని, పాప కిడ్నాప్ అయినప్పటినుంచి సరోజమ్మ కుటుంబ సభ్యులు కూడా పారిపోయారని ఆరోపించారు. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.