మాదాపూర్, జూలై 29: ప్రేమ పేరుతో మరో యువతని ఓ ఉన్మాది బలితీసుకున్నాడు. ప్రియురాలిని అతి కిరాతకంగా బ్లేడుతో గొంతుకోసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా బొంరాస్పేటకు చెందిన యువకుడు బుధవారం మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్లో ప్రియురాలితో కలిసి ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం ఇరువురి మధ్య గొడవ జరుగడంతో ఆమెను బ్లేడుతో గొంతుకోసి హత్యచేసి బాత్రూంలో శవాన్ని పడేశాడు. ఆ తరువాత ఆమె చున్నీతోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు తెలిపారు.
మృతులను బొంరాస్పేట మండలం హకీంపేటకు చెందిన రాములు (25), లగిచెర్ల గ్రామానికి చెందిన సంతోషి (25)గా గుర్తించారు. హోటల్ సిబ్బంది సమాచారం అందించటంతో ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంతోషి, రాములు 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పోలీసులు తెలిపారు.