యాకుత్పురా : హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాన్ హోల్స్ గతంలో ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి. మ్యాన్ హోల్లో పడి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో.. స్కూల్కు వెళ్తూ ఓ విద్యార్థిని మ్యాన్హోల్ తెరిచి ఉండటంతో అందులో పడిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్పురాలో చోటుచేసుకుంది.
జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో స్కూల్కు వెళ్తూ బాలిక డ్రైనేజీలో పడిపోయింది. గమనించిన తల్లి బాలికను సకాలంలో కాపాడింది. బాలిక డ్రైనేజీలో పడటాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. బాలికను తల్లి వెంటనే పైకి లాగగా.. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పుస్తకాలను బయటకు తీశారు. చిన్నారి క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోందని, అయినా.. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది.