భారీగా నిధుల కేటాయింపు
మంత్రులు సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ రూరల్, మార్చి 17 : గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల స్థలంలో రూ.4.20 కోట్లతో చేపట్టిన బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు చేయూతనిస్తుందని తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన గురుకుల, ఆశ్రమ, సంక్షేమ విద్యా సంస్థల్లో నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు కేజీ టూ పీజీ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజన బిడ్డలు విద్యలో ప్రతిభ చూపుతున్నారని తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసించిన 64 మంది నీట్లో ఉత్తీర్ణత సాధించమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోమారంలో ఆరు ఎకరాల స్థలాన్ని గురుకుల పాఠశాలకు ఇచ్చిన మంత్రి మల్లారెడ్డికి ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమారంలో 300 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం ఉన్నదని, బంజారా భవన్, గిరిజన ఆశ్రమ పాఠశాలకు నిధులు మంజూరు చేయాలని, 15 నుంచి 20 ఎకరాల భూమిని కేటాయిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు మంత్రి సత్యవతి స్పందిస్తూ ఈ బడ్జెట్లోనే బంజారా భవన్కు రూ.1.50 కోట్లు, గిరిజన ఆశ్రమ పాఠశాలకు రూ.3 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందారెడ్డి, సర్పంచులు కరుణాకర్ రెడ్డి, సుజాతా కిషన్ నాయక్, గణేశ్, అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, నాయకులు భాస్కర్ యాదవ్, రాజ మల్లారెడ్డి, భాగ్యారెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, యూనుస్పాషా తదితరులు పాల్గొన్నారు.