కొండాపూర్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవల్లో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి అవగాహన సర్వేను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పరిశీలించారు. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ వసంత వ్యాలీలో కొనసాగుతున్న అవగాహన సర్వేను వెస్ట్జోన్ జెడ్సీ రవికిరణ్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మీలతో కలిసి పరిశీలించారు.
సర్వేలో రెండు డోసులు వేయించుకున్న వారి ఇంటికి స్టిక్కర్లను అతికించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ కోసం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవలను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జెడ్సీ, డీసీలకు కలెక్టర్ సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.