సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో జంక్షన్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అందంగా ముస్తాబు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సైబర్టవర్స్-శిల్పారామం జంక్షన్లలో సరికొత్త అందాలను పరిచయం చేశారు. అర్బన్ సీటింగ్, గొడుగు అకారంలో షెల్టర్, పాదచారులు సేద తీరేలా విభిన్న ఆకృతులు కొలువుదీరగా.. సెల్ఫీ పాయింట్లుగా మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో మరికొన్ని కూడళ్లలో కొత్తందాలను సమకూర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.