మెహిదీపట్నం: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే కార్వాన్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ గోల్కొండ సర్కిల్ టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రభావతిని ఉన్నతాధికారులు పాతబస్తీ యాకూత్పురాకు మూడు రోజుల కిందట బదిలీ చేశారు.ఆమె స్థానంలో ప్రకాశ్ను నియమించి బాధ్యతలను అప్పగించారు.
ఈ క్రమంలో గోల్కొండ సర్కిల్ నుంచి ప్రభావతి తాను వెళ్లనంటూ.. అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. ప్రకాశ్ కూడా విధులు నిర్వర్తిస్తుండటంతో ప్రజలు ఎవరిని కలవాలో తెలియని అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా సిబ్బంది కూడా తాము ఏ అధికారి మాట వినాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బదిలీ అవ్వగానే సంబంధిత అధికారి తనను నియమించిన ఇతర ప్రాంతానికి వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఆలా కాకుండా ప్రభావతి గోల్కొండ సర్కిల్ నుంచి వెళ్లనంటూ.. మొండికేస్తుండటంపై సర్వతా విమర్శలు వస్తున్నాయి.ఈ విషయమై సంబంధిత టౌన్ ప్లానింగ్ ఏసీపీ స్వామి నాయక్కు వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరు.