సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వారీగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని భావించి ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. సాధారణంగా ఏడాదికి నాలాల పూడికతీతకు రూ. 45 కోట్ల మేర ఖర్చు చేస్తున్నా పనులు పారదర్శకంగా ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దరిమిలా పనులను పక్కాగా చేపట్టాలని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేలా టెండర్ నిబంధనల రూపకల్పన చేశారు. ఇది సాధ్యం కాకపోవడంతో చివరి నిమిషంలో మళ్లీ పాత పద్ధతి మనుషులు, మిషనరీతో పనులు చేపట్టారు.
రూ. 45కోట్లతో 884.15 కిలోమీటర్ల మేర నాలాలలో పూడిక తొలగింపు పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభించి జూన్ నాటికల్లా దాదాపు ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతను చేపట్టారు. ఇదే పద్ధతిలో వచ్చే ఏడాది పనుల్లో భాగంగా రూ. 45 కోట్ల పనులకుగానూ టెండర్లను పిలిచేందుకు ఇంజినీర్లు కసరత్తు ప్రారంభించారు. జనవరి రెండో వారానికల్లా పూడికతీత పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నెల చివరి వారంలో ప్రారంభించి మాన్సూన్ నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1368 కిలోమీటర్ల మేర నాలాలు, వరద కాలువలు ఉండగా, పూడికతీత పనులు ఆరుగురు ఎస్ఈలు, ఆయా జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో సాగనున్నాయి. ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, వెబ్సైట్ను రూపొందించారు. ఏ రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి? ఏ మేరకు జరిగాయనే అంశాలను పర్యవేక్షిస్తూ పనులను అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు.