సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మరో 114 ప్రధానమైన జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్లను అభివృద్ధి చేయడంతో పాటుగా మరింత మెరుగు పరిచేందుకు నగరంలో ప్రయోగాత్మకంగా 12 కూడళ్లను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీ తట్టుకునే విధంగా అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తూ సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకుగాను ఈ చర్యలు చేపడుతున్నది.
నగరంలో 60 జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
నగరంలో యుద్ధ ప్రాతిపదికన మరో 60 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రతిపాదించిన జంక్షన్లు కొన్ని మూడు మార్గాలు, మరికొన్ని చోట్ల 4 మార్గాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్బీనగర్ జోన్లో 10 జంక్షన్లను అభివృద్ధికి ప్రతిపాదించారు. చార్మినార్ జోన్లో 10 జంక్షన్లు, ఖైరతాబాద్ జోన్లో 11, శేరిలింగంపల్లి జోన్లో 9, కూకట్పల్లి జోన్లో 9, సికింద్రాబాద్ జోన్లో 11 జంక్షన్ల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చేపట్టారు.
మరో 54 జంక్షన్ల సుందరీకరణకు కృషి
జీహెచ్ఎంసీ పరిధిలో 33 కోట్ల అంచనా వ్యయంతో ప్రయోగాత్మకంగా 12 జంక్షన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పాదచారుల ప్రయోజనం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గార్డెనింగ్ ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. నగరంలో 54 జంక్షన్లను మరింత అభివృద్ధి పరిచి, సుందరీకరించి నగరవాసులను ఆకట్టుకునేలా.., ఆకర్షణీయంగా కనబడేలా.. తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ జంక్షన్లలో పాదచారులు కూర్చోవడానికి కుర్చీలు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఎల్బీనగర్ జోన్లో 6, చార్మినార్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 24, శేరిలింగంపల్లి జోన్లో 6, కూకట్పల్లి జోన్లో 6, సికింద్రాబాద్ జోన్లో 9 జంక్షన్లను అభివృద్ధి పర్చడంతో పాటు సుందరీకరించనున్నారు.
రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నగరంలో 350కి పైగా జంక్షన్లు ఉండగా అందులో మేజర్ జంక్షన్లను అభివృద్ధిపరిచి రవాణా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పాదచారుల ప్రయోజనార్థం మరింత ఆకర్షణీయంగా కనబడేలా చర్యలు తీసుకున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. ప్రజల అవసరాలను తగినట్లుగా, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి తెలిపారు.