GHMC | సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేలను పంపిణీకి శ్రీకారం చుట్టింది. రుణాల పంపిణీలో భాగంగా వీధుల్లో తిరుగుతూ చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో హైదరాబాద్ మహా నగరంలో సర్వే చేయగా, 1,65,638 మందిని గుర్తించారు. అందులో భాగంగా 1,65,301 మందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. 30 వెండింగ్ కమిటీలను ఏర్పాటుతో పాటు 584 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మూడో విడతలో 5,808 మందికి గాను రూ.28.69 కోట్ల రుణాలను అందజేయగా, మొత్తం మూడు విడతల్లో 85,441 మందికి రూ.130.76 కోట్ల రుణాలను అందించారు. కాగా ఇప్పటి వరకు రూ.2.24 కోట్లను వీధి వ్యాపారులు క్యాష్ బ్యాక్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆమలు చేస్తున్న వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, శ్రమయోగి మందన్ ఫించన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్షణ యోజన, జన్ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు, తదితర పథకాలను మరింత పకడ్బందీగా అందించేందుకు వీధి వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపర్చేందుకు వెబ్ ఆధారిత ప్రత్యేక సమగ్ర యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగానే వీధి వ్యాపారులను చైతన్యం చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు ‘మై బీ డిజిటల్’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు వీధి వ్యాపారులతో స్విగ్గీ, జుమోటోలు ఒప్పందం కుదుర్చుకుంటుండటం గమనార్హం.