గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనాలతో మరొకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్వచ్ఛ ఆటోలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఆటో బయలు దేరే సమయం నుంచి వ్యర్థాల సేకరణ పూర్తయ్యాక ట్రాన్స్ఫర్ స్టేషన్లకు వెళ్లే వరకు ‘క్యూ ఆర్’ స్కాన్ పెట్టారు. రోజువారీగా హాజరు, సమయ పాలన, ఇంటింటికీ రుసుం వసూలు తదితర అంశాల పర్యవేక్షణకు ఎస్ఎఫ్ఏలకు కీలక బాధ్యతలు అప్పగించారు.ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపే తప్పనిసరిగా వందశాతం చెత్త సేకరణ పూర్తికావాలని నిర్ణయించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై వార్డు స్థాయిలోనే కార్పొరేటర్ల అధ్యక్షతన సమీక్ష నిర్వహించాలని మంగళవారం జోనల్ కమిషనర్ల సారథ్యంలో జరిగిన ఎస్ఎఫ్ఏల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వంద శాతం చెత్త సేకరణ లక్ష్యంతో జీహెచ్ఎంసీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇంటింటికీ చెత్త సేకరణలో ప్రధానంగా ఉన్న స్వచ్ఛ ఆటోల పనితీరులో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. 2016లో డ్రైవర్ కం.. ఓనర్ స్కీంలో స్వచ్ఛ ఆటోలను తీసుకున్న 2500 మంది రుణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో చాలా మంది డ్రైవర్లు చెత్త సేకరణలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛ ఆటోల పనితీరుపై ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచే కాకుండా రెసిడెన్షియల్ కాలనీల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు దారితప్పుతున్న స్వచ్ఛ ఆటోల లక్ష్యాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. చెత్త సేకరణలో సమస్యలు వస్తే 040-21111111కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
పనితీరుపై పక్కాగా నిఘా..
ఇక మీదట స్వచ్ఛ ఆటోల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇందులో ప్రధానంగా ఉదయం ఆటో బయలు దేరే సమయం.. వ్యర్థాల సేకరణ పూర్తయ్యాక ట్రాన్స్ఫర్ స్టేషన్లకు వెళ్లే వరకు ‘క్యూ ఆర్’ స్కాన్ చేయనున్నారు. ఎస్ఎఫ్ఏలకు బాధ్యతలు అప్పగించారు. రోజువారీగా చెత్త సేకరించే వారి హాజరు పట్టికను పర్యవేక్షించనున్నారు. సమయ పాలనలో తేడా వచ్చినా.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా.. ఇతర ప్రాంతాలకు వెళ్లినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సంబంధిత వాహనాన్ని ఇతర నిరుద్యోగ యువతకు అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జోనల్ కమిషనర్ల సారథ్యంలో మంగళవారం ఎస్ఎఫ్ఏలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
వార్డు స్థాయిలో సమీక్ష..
వార్డులో కేటాయించిన స్వచ్ఛ ఆటోలు మొదలుకొని.. కాలనీల కేటాయింపు, ఒకొక ఆటోకు ఇండ్ల కేటాయింపు, ఇంటింటికీ రుసుం వసూలు చేసే వివరాలను సంబంధిత కార్పొరేటర్కు ముందుగా వివరించి అవగాహన కల్పిస్తున్నారు . ఆ తర్వాత కార్పొరేటర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేటాయించిన కాలనీల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తప్పనిసరిగా ఉండి.. ఇండ్ల నుంచి వందకు వంద శాతం చెత్తను సేకరించాలి. ఒక వేళ లక్ష్యాన్ని పూర్తి చేయక.. నిర్దేశించిన సమయం వరకు ఉండని పక్షంలో కేటాయింపును రద్దు చేస్తారు. అట్టి వాహనాన్ని ఇతరులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. స్వచ్ఛ ఆటోల యజమానులు తనకు కేటాయించిన కాలనీల్లో మాత్రమే చెత్త సేకరణ చేయాలని, ఇతర కాలనీల్లో వ్యర్థాల సేకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
ఒక్కో ఆటో 600 ఇండ్ల నుంచి..
ఒకొక ఆటో సుమారు రూ. 7.50 లక్షలతో కొనుగోలు చేసి.. అప్పు చెల్లించే బాధ్యతలో జీహెచ్ఎంసీ బ్యాంకులకు హామీ ఇచ్చింది. సుమారు 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలోని 4886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 6500 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరుగుతున్నది. కాలనీ వారీగా పరిశీలిస్తే ఒకొక ఆటోకు 500 నుంచి 600 ఇండ్లను కేటాయించారు.
పనితీరు మెరుగుపడకపోతే ఇతరులకు అవకాశం ఇస్తాం
స్వచ్ఛ ఆటోల పనితీరు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తప్పనిసరిగా కేటాయించిన కాలనీల్లోనే ఉండి వందకు వంద శాతం వ్యర్థాల సేకరణ పూర్తి చేయాలి. ఆ తర్వాతనే కాలనీ నుంచి బయటకు వెళ్లాలని ఎస్ఎఫ్ఏ, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ గ్యారెంటీతో బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాం. కొందరు లక్ష్యాన్ని పకకు పెట్టి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. వారు పనితీరును మార్చుకోని పక్షంలో వారి ఆటోలు ఇతర నిరుద్యోగ యువకులకు కేటాయించేందుకు వెనుకాడం.
– మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్