సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఏటా సమ్మర్క్యాంపులో భాగంగా వచ్చే వేసవిలోనూ చిన్నారులతో పాటు యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్కు రూ.2 లక్షల క్రీడా సామగ్రి ఆయా సమ్మర్ క్యాంపులు నిర్వహించే క్రీడా ప్రాంగణాలకు అందజేయనున్నారు.
ఈ మేరకు సామగ్రి కొనుగోలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్బాల్, స్కేటింగ్, టెన్నిస్, టెబుల్ టెన్నిస్ తదితర క్రీడా సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపు -2024లో 6 సంవత్సరాల వయస్సు నుంచి 16 సంవత్సరాల చిన్నారులకు వివిధ క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నారు. డివిజన్కు క్రీడా సామగ్రి, సమ్మర్ క్యాంపులపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని అధికారులు తెలిపారు.