సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : బల్దియా.. ఖజానా నింపుకొనేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. బడా బాబుల బకాయిల రికవరీపై దృష్టి సారించకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్గా కార్యాచరణను ఆమలు చేస్తున్నది. ఒకవైపు అడ్డగోలుగా ట్యాక్స్ సవరణలు చేపడుతూ.. రెండింతల భారం యాజమానులపై మోపుతున్నది. ఈ నేపథ్యంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3వేల కోట్ల రాబడి లక్ష్యంగా ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఈ మేరకు డిసెంబర్ చివరి నాటికి రూ. 1512.54 కోట్లను సమకూర్చుకున్నది. గతేడాదితో పోల్చితే రూ.121.77 కోట్ల అధిక ఆదాయం వచ్చినట్లు, 8% వసూళ్లు పెరిగాయని స్వయంగా కమిషనర్ రెండు రోజుల కిందట ప్రకటించారు. అయితే ఆస్తిపన్ను వసూళ్లలో బడా బాబులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను పట్టించుకోని బల్దియా అధికారులు…సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వసూళ్లను రాబడతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రూ.1512 కోట్ల మేర పైగా ఆదాయాన్ని సమకూర్చుకున్న అధికారులు, ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికల్లా రూ.3వేల కోట్ల వసూళ్ల రూపంలో రాబట్టుకోవాలని నిర్ణయించింది. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలోనూ బడా వ్యాపారులను వదిలేసి చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తాజాగా భవనం కట్టకుండా ఖాళీ ప్లాట్లపై వీఎల్టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వసూలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషన.ర్ టార్గెట్ విధించారు. సాధారణంగా భవనాలు నిర్మించుకున్నాక ఆస్తిపన్ను చెల్లించడం ప్రజలకు అలవాటు. భవనం కట్టకుండా ఖాళీ ప్లాట్గా ఎంతకాలం ఉన్నా.. దానికి పన్ను చెల్లించేందుకు చాలా మంది సముఖంగా ఉండరు. పన్ను చెల్లించాలనే విషయం తెలియని వారు కూడా చాలా మంది ఉంటారు.
ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) చెల్లించాలి. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05 శాతం వీఎల్టీగా చెల్లించాలి. దాదాపు రెండేండ్ల కిందట రిజిస్ట్రేషన్ల మేరకు వీఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 32వేల వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి నుంచి దాదాపు రూ. 110 కోట్ల ఆదాయం సమకూరుతుందని నిర్ణయించి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్కు రోజువారీ టార్గెట్ విధించి వసూళ్లలో వేగం పెంచాలని కమిషనర్ జడ్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు పీటీఐఎన్ పొం దాలంటే నిర్మాణం పూర్తయ్యాక జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూ డా దరఖాస్తు చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దరఖాస్తుదారు ఇంటిని సందర్శించి ప్రాంతం, నిర్మాణం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేస్తా రు. దీంతో పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. అనంతరం పన్ను చెల్లించి రసీదు పొందవచ్చు.
పీటీఐఎన్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అ లాగే, ఖాళీ ప్లాట్లకు వీఎల్టీ చెల్లించాల్సి ఉంటు ంది. దీనికోసం కూడా స్థానిక జీహెచ్ఎంసీ సర్కి ల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అ నంతరం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ప్లాటును తనిఖీ చేసి అక్కడి మార్కెట్ ధర ఆధారంగా 0.5 శాతం పన్ను విధిస్తారు. పన్ను చెల్లిస్తే పీటీఐఎన్ జనరేట్ చేసి వీఎల్టీ రసీదు జారీ చేస్తారు. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వీఎల్టీ ఎంతోకాలంగా ఉన్నప్పటికీ ఖాళీ ప్లాట్ల యజమానులు ఇది చెల్లించడంలేదు. ఇంటి అనుమతులకు వెళ్లే సందర్భంలో మాత్రమే వీఎల్టీ చెల్లిస్తున్నారు. అసెస్ కానీ ఖాళీ ప్లాట్లను కూడా క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని ట్యాక్స్ జాబితాలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్ని ఖాళీ ప్లాట్ల నుంచి పన్ను వసూలయ్యే లా డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు, యాజమానులను సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పన్ను చెల్లించని వారి స్థలాల్లో బకాయిలున్నట్లు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.