సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1650 కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 4,79,690 మంది బకాయిదారులను గుర్తించి.. వారికి రెడ్ నోటీసుల జారీకి సిద్ధమైంది. అందులో పేర్కొన్న గడువులోగా ఆస్తిపన్ను చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.
రూ.407 కోట్ల టార్గెట్
ఆర్థిక సంవత్సరం వచ్చే నెలాఖరులోగా ముగుస్తుండడంతో ఈ రెండు నెలల పాటు ఆస్తిపన్ను వసూళ్లపై జోన్ల వారీగా ప్రత్యేక లక్ష్యాలను ఖరారు చేశారు. ఎల్బీనగర్ రూ.26.29 కోట్లు, చార్మినార్ రూ.52.20, ఖైరతాబాద్ రూ.161.43, శేరిలింగంపల్లి రూ. 61.76, కూకట్పల్లి రూ. 35.70 , సికింద్రాబాద్ రూ. 70 కోట్లు కలిసి ఆరు జోన్ల నుంచి ఈ నెలాఖరు నాటికల్లా రూ. 407.38 కోట్లు రాబట్టాలని లక్ష్యాన్ని విధించారు.