సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్చుకోవాలని సూచిస్తూ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లోగా నివాసం ఉంచి వాణిజ్య కేటగిరికి మార్చుకోవాలని, లేని పక్షంలో జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు పెనాల్టీ పడుతుందని సదరు నోటీసులో పేర్కొన్నారు. కేటగిరి మార్పు ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలో తెలిపే వివరాలతో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నివాసం నుంచి వాణిజ్యానికి మారిన వారేకాక ఇంతవరకు ఆస్తిపన్ను అసెస్మెంట్ కానీ వారు అసలు విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికి ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారు (అండర్ అసెస్డ్) సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిలని అధికారులు పేర్కొన్నారు.
రెసిడెన్షియల్ టు కమర్షియల్ కేటగిరి మార్పునకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. https;//cr.ghmc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి కమర్షియల్ యూసేజ్ అప్లికేషన్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేశాక డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, వివరాలను నమోదు చేయాలి. ఫీజులను చెల్లించేందుకు ఛలాన్ను జనరేట్ చేసి అందులో సూచించిన అకౌంట్కు నిఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ ఒకే అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్ను పొందవచ్చు.