కొండాపూర్ : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవలను పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ ఎన్ రవి కిరణ్ తెలిపారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను డివిజన్ ఉప కమిషనర్ సుధాంషుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్సీ రవికిరణ్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవల ప్రచారం విస్తృతంగా కొనసాగించాల్సిందిగా తెలిపారు.
ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకాను అందించే దిశగా ముందుకు సాగాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించారు. వ్యాక్సినేషన్ సెంటర్కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
కొనసాగుతున్న ఇంటింటి అవగాహన సర్వే…
శేరిలింగంపల్లి సర్కిల్ -20, చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని డివిజన్లలోమొబైల్ వ్యాక్సినేషన్పై జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. కరోనాను నియంత్రించగల ఏకైక ఆయుధం కొవిడ్ టీకానే అంటూ సర్వే లో అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు.
వ్యాక్సిన్ కోసం దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందని కొంతమంది టీకాలకు దూరంగా ఉంటున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా కాలనీ, ఇంటిదగ్గరకే వచ్చి కొవిడ్ టీకాలను అందిస్తున్నారని, తప్పనిసరిగా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. ఇంటింటి అవగాహన సర్వేలో వ్యాక్సిన్ తీసుకున్నవారి, తీసుకోనివారి వివరాలను సేకరిస్తున్నారు. కొండాపూర్లో కొనసాగుతున్న సర్వేలో ఎస్ఎఫ్ఏ జలాలుద్దీన్, ఆర్పీ రూపా తదితరులు పాల్గొన్నారు.