సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి ఘటనలో ఎట్టకేలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ఆర్సీ) ఆదేశాలను జీహెచ్ఎంసీ అమలు చేసింది. యూసుఫ్గూడ గార్బేజ్ స్టేషన్లో విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుడు సుధాకర్ చనిపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
హెచ్ఆర్సీ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన జరిగిన విచారణలో మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు, అర్హత నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యులకు రెండు ఉద్యోగాలు కల్పించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో సమగ్ర భద్రతా చర్యలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తగిన మానవతా సహాయం అందించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టినందున తదుపరి విచారణ అవసరం లేదని కమిషన్ భావించి కేసును ముగించారు.