వర్షాలు ఎడతెరిపి లేకుండా జోరందుకోవడంతో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీ ఈఈ ఆశలత పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, మాన్సూన్ అత్యవసర బృందాలు సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, సీతాఫల్మండి, మెట్టుగూడ, బౌద్ధనగర్ ప్రాంతాల్లో అనునిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ…ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సమస్యలు తలెత్తుతున్న వాటిని వెనువెంటనే సిబ్బంది, మాన్సూన్ బృందాలు పరిష్కరిస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
అడ్డగుట్ట/ మారేడ్పల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20 పలుప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, మారేడ్పల్లి, తాడ్బంద్ , రసూల్పురా, రెజిమెంటల్బజార్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది. కంటోన్మెంట్ ఐదవ వార్డు కాకాగూడ, వాసవీనగర్ కాలనీల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో గజ్జెల నాగేష్ యువ సేన సభ్యులు రావుల సతీష్, శ్రీనివాస్, నరేష్, మారుతి సాఫిగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రెజిమెంటల్బజార్లోని మనోహర్ థియేటర్ సమీపంలో వర్షం నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోండా డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని పలు రహదారుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
బౌద్ధనగర్ డివిజన్లో..
రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బౌద్ధనగర్ డివిజన్లో వివిధ ప్రాంతల్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజ పర్యటించారు. డివిజన్లోని ఏఆర్కే నగర్, అశోక్నగర్, గొల్లపుల్లయ్య బావి, కౌసర్ మసీద్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, డీఈ రఘు, ఏఈ శశిధర్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.