మల్కాజిగిరి, మే 5: మల్కాజిగిరి నియోజకవర్గంలోని కాలనీల్లో జీహెచ్ఎంసీ అధికారులు వరదముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరి, నేరేడ్మెట్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, మౌలాలి, అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం డివిజన్లలోని ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో వరద ముంపు నివారణకు దాదాపు రూ. 60 లక్షలతో ముందస్తుగా నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. ముంపు తలెత్తకుండా ఇప్పటికే మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ల పరిధిలో దాదాపు రూ. 4 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఓపెన్ నాలాల వల్ల ప్రమాదాలు జరుగకుండా వాటిపైన స్లాబులు, జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు నాలాల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లు, సీసాలు వేయవద్దని, వరద నీరు ప్రవహించకుండా ప్లాస్టిక్ వస్తువులు అడ్డుపడుతున్నాయని అధికారులు సూచించారు. కొన్నిచోట్ల పగిలిపోయిన స్లాబ్లు తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు.
అకాల వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్ హోల్స్, గుంతలు, సెల్లార్ గుంతలను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ను అప్రమత్తం చేశాం. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ఎమర్జెన్సీ టీమ్లు సిద్ధంగా ఉన్నాయి.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే