సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటినంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టరు పత్రాలున్న ఆన్లైన్ దరఖాస్తు ద్వారా నిమిషాల్లో ఇంటి నంబరు ఇవ్వాలనే లక్ష్యంతో ‘స్వీయ మదింపు’ (సెల్ఫ్ అసెస్మెంట్) విధానాన్ని తీసుకొచ్చారు. కొందరు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా మోసాలను గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో దాదాపు 300 నిర్మాణాల పీటీఐఎన్లను బ్లాక్ చేశారు. వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేస్తున్నారు.
నోటరీ డాక్యుమెంట్లు సమర్పించడం, మరికొందరు ఎక్కువ ప్లింత్ ఏరియాకు తక్కువగా చూపించడం, కమర్షియల్ ప్రాపర్టీని రెసిడెన్షియల్గా పేర్కొనడం లాంటి మోసపూరిత దరఖాస్తు చేసి పీటీఐఎన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు)లు పొందారు. అయితే సదరు యాజమాని సమర్పించిన దరఖాస్తులోని వివరాలు సరైనవా? కాదా? అని సరిచూసుకునే వ్యవస్థ లేకపోవడం, అధికారితో సంబంధం లేకుండా ఆన్లైన్లో నేరుగా ఇంటి నంబరు జారీ కావడంతో ఈ పద్ధతిని అక్రమార్కులు అవకాశంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలు మున్ముందు జరుగకుండా ఉండేందుకుగానూ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టం’ ఏర్పాటు దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. లోపాలను సవరించడం, తద్వారా పర్యవేక్షణతో పాటు జీహెచ్ఎంసీ రెవెన్యూ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వీయ మదింపులో ఇవి తప్పనిసరి
ఆన్లైన్ సెల్ఫ్ అసెస్మెంట్ (స్వీయ మూల్యాంకన) పథకం దరఖాస్తులో పది అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దరఖాస్తు సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబరు/తేదీ, యజమాని పేరు/తండ్రి పేరు, ప్లింత్ ఏరియా, సర్కిల్, ప్రాంతం/చిరునామా, బిల్డింగ్ ఉపయోగం (నివాసమా/నివాసేతరమా?), బిల్డింగ్ అనుమతి వివరాలు, డివియేషన్ రకం, (అనధీకృత నిర్మాణ జరిమానా విధింపు నిమిత్తం), రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ వివరాలన్నీ సమర్పించిన తర్వాత సదరు పౌరుడు ఎంటర్ చేసిన ప్లింత్ ఏరియా, ఆస్తి ఉపయోగం, సర్కిల్ వివరాల ఆధారంగా సిస్టం ద్వారా ఆస్తిపన్నును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. విజయవంతంగా చెల్లింపు జరిగాక డోర్ నంబర్ లేకుండానే పీటీఐఎన్ను వెంటనే కేటాయిస్తారు. అప్లోడ్ చేయబడిన రిజిస్ట్రేషన్ పత్రంలో ఆస్తి షెడ్యూల్ ఆధారంగా సంబంధిత డిప్యూటీ కమిషనర్ డోర్ నంబరు ఒకటి కేటాయించి పొరుగువారి పరిసరాల వరుసను కొనసాగించనున్నారు. ప్రతి వారం స్వీయ మూల్యాంకన డేటాను డిప్యూటీ కమిషనర్లచే డేటా సంకలనం చేస్తున్నారు.