దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా లేకుండా ఫుట్పాత్పైనే వాలిపోతారు. అలాంటి వాళ్లందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వెచ్చగా పడుకునేందుకు చక్కటి ఆశ్రయాన్ని ఏర్పాటు చేసింది మన జీహెచ్ఎంసీ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వైద్యం కోసం సర్కారు దవాఖానలకు వస్తూ ఉంటారు. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు రెండు మూడు రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది రోగులు, వారి సహాయకులు దవాఖానల వద్దే ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి వారి కోసం నగరంలో 14 చోట్ల బస చేసేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. మూడు పూటలా భోజనం పెట్టి, పడుకునేందుకు చక్కటి వసతి ఏర్పాటు చేయడంతో ‘ఇది మనసున్న సర్కారు’ అంటూ రోగులు, వారి సహాయకులు మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పలు కారణాలతో ఇండ్లను వదిలి వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు జీహెచ్ఎంసీ తనవంతు కృషి చేస్తోంది. ప్రతిరోజు నగరానికి లక్షలాది మంది వస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వారి సంఖ్యకు తగ్గట్లు నైట్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం ప్రధాన దవాఖానలైన కోఠి మెటర్నరీ, మహావీర్, ఈఎన్టీ, నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, నాంపల్లి ఏరియా వైద్యశాలలతో పాటు 14 రద్దీ ప్రాంతాల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయగా.. మరో 940 మందికి కాలానికి అతీతంగా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి ఉచితంగా అల్పాహారంతో పాటు రెండు పూటల భోజన వసతి, దుప్పట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ అండగా నిలబడుతున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నెట్ షెల్టర్ల నిర్వహణ బాధ్యతలను పలు స్వచ్ఛంద సంస్థలు చూస్తుండగా.. ప్రతి మంగళవారం, శుక్రవారం టాస్క్ఫోర్స్ కమిటీ తనిఖీలు నిర్వహిస్తున్నది. మెరుగైన సేవలు అందేలా చూస్తున్నది. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వచ్చే వారికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుండడంతో వారంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బౌద్ధనగర్లోని నైట్ షెల్టర్లో సోమవారం రాత్రి నిద్రపోతున్న నిరాశ్రయులు
మనసున్న సర్కారుగా..
కష్టకాలంలో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్కు చేరుకుంటున్న వారికి రాష్ట్ర సర్కార్ అండగా నిలుస్తున్నది. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రభుత్వం వైద్యశాలలకు వస్తున్న సామాన్య రోగులు, వారి సహాయకులు వసతి కోసం పడుతున్న బాధలు వర్ణణాతీతం. ఓ వేళ ఆస్పత్రిలో చేరితే సరి.. కానీ కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు రోగులు రోజుల తరబడి ఇకడే ఉండాల్సి ఉంటుంది. ఓ వేళ రోగి ఆస్పత్రిలో చేరినట్లయితే వారికి సహాయంగా కనీసంగా ఒకరిద్దరు సహాయకులు కూడా అనివార్యం. ఈ క్రమంలో వారంతా రాత్రివేళల్లో బస చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఫుట్ పాత్లపై చలికి వణుకుతూ నానా అవస్థలు పడుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించింది. గతంలో ఏ ప్రభుత్వానికీ రాని ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చింది. మనసున్న సరారుగా నిరూపించుకుంటున్నది.