సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులను ఊడ్చేందుకు కొత్తగా స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వినియోగమే తప్ప కార్మికులతో పని చేయించవద్దన్న నిబంధన ఉంది. ఇందులో భాగంగానే 12 భారీ యంత్రాలు, ఐదు మినీ స్వీపింగ్ యంత్రాలను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది.
మరో 18 యంత్రాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నది. అయితే మూడేండ్ల క్రితం సీఆర్ఎంపీ కింద కొన్ని రోడ్లను జీహెచ్ఎంసీ ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణకు ఇచ్చింది. రోడ్లను గుంతలు లేకుండా చూసుకోవడం, ఆయా రహదారులపై చెత్తను ఊడ్చడం, పచ్చదనం పెంపు ఇతరత్రా పనులు సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలే నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే సదరు ఏజెన్సీలు జీహెచ్ఎంసీకి సంబంధించిన యంత్రాలను కొన్ని సార్లు వినియోగిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. ఈ దుర్వినియోగాన్ని కట్టడి చేస్తూనే పాత బస్తీ రోడ్లను ఊడ్చేందుకు యంత్రాలు లేవని గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే స్వీపింగ్ యంత్రాల పనితీరు, నూతన కొనుగోలుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని తాజాగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇతర రహదారులను ఊడ్చేందుకు ఇప్పుడున్న 35 యంత్రాలకు అదనంగా అవసరం అవుతాయని, కొత్తవి మార్చి నెలాఖరులోగా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పారిశుధ్య విభాగంలోని ఓ అధికారి తెలిపారు.