రానున్న వర్షాకాలంలో వర్షం నీరు సులభంగా నాలాల్లోకి చేరేలా చూడాలి. ముంపుసమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. రూ.858 కోట్లతో డీపీఆర్లను సిద్ధం చేశాం. డీపీఆర్ పూర్తయిన పనులకు టెండర్లు పిలువాలి. ఈ నెలాఖరు నాటికి నాలాల పూడిక తీత పనులు పూర్తిచేసి.. వార్డుల వారీగా జియోట్యాగింగ్ చేయాలి. అత్యవసర బృందాలకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లు కార్పొరేటర్లకు అందించాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు.
సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రానున్న వర్షాకాలంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను అదిగమించేందుకు పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ధి పనులతో పాటు నాలాల విస్తరణ, పూడికతీతకు సంబంధించి సుమారు రూ.858 కోట్లతో డీపీఆర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే నాలాల పూడికతీత, నాలాల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతితో పాటు తదితర అంశాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మేయర్ వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తకుండ పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఈ నెలాఖరు నాటికి నాలాల పూడికతీత, విస్తరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రూ.858 కోట్లతో డీపీఆర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. డీపీఆర్లు పూర్తయిన పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పిలువాలని సూచించారు. వర్షాకాలంలో వర్షం నీరు సులభంగా నాలాల్లోకి వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అలాగే వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర బృందాల వివరాలను, సంబంధిత అధికారి ఫోన్ నంబర్లను కార్పొరేటర్లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు అందించాలని కమిషనర్కు సూచించారు. పూడికతీత పనులను పర్యవేక్షించే అధికారులు, కూలిన చెట్లను తొలగించేందుకు నియమించిన వారి వివరాలను, ఫోన్ నంబర్లను కార్పొరేటర్లకు అందించాలన్నారు.
సోషల్ మీడియా ద్వారా నగర పౌరుల నుంచి వస్తున్న ఫిర్యాదులను సైతం సంబంధిత అధికారులు తక్షణం పరిష్కరించాలన్నారు. నగరంలో పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పనులను వార్డుల వారీగా జియోట్యాగింగ్ చేయడంతో పాటు స్థానిక కార్పొరేటర్లకు అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. అలాగే రూ.858 కోట్లకు సంబంధించిన పనులకు పరిపాలన ఆమోదం వచ్చిందని, ఈ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డీపీఆర్లను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజినీర్ వసంత, జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు.