సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, గీతా మాధురి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సాటి మహిళలేనని, ఒకరికొకరు సపోర్టు చేసినప్పుడు మహిళ అభ్యున్నతి సాకారమవుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
అన్ని రంగాల్లో మహిళలు మగవారికంటే ముందంజలో ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారతకు జీహెచ్ఎంసీ నిదర్శనమన్నారు. సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా, ఇందిరాగాంధీ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని మహిళలు చైతన్యవంతం కావాలని పేర్కొన్నారు. మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ గీతా మాధురి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. 15మంది శానిటేషన్ కార్మికులను సన్మానించారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి మేయర్ సహా పంక్తి భోజనం చేశారు. ఈ సహపంక్తి భోజనంలో డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, అడిషనల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.