సిటీబ్యూరో, నవంబరు 8 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. రెండు కేటగిరీల్లో ఈ బడ్జెట్ను రూపొందించారు. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్ను ‘ఏ’ కేటగిరిగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులను ‘బి’గా చూపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.6150కోట్లుగా ఉంది.
ఇందులో ఏ కేటగిరిలో రూ. 6150కోట్లు, ఇతర సంస్థలవి రూ. 406.70 కోట్లు ఉంది. కాగా, గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా రూ. 74కోట్ల మేర బడ్జెట్ పద్దు పెంచారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనపై బుధవారం (నేడు) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ ఆమోదించనుంది. ఆ తర్వాత నిర్వహించే గ్రేటర్ కౌన్సిల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.