GHMC | సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : జవహర్నగర్ డంపింగ్ యార్డుపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మరో నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. జనావాసాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు. స్థలాలను పరిశీలిస్తున్నారు. స్థల సేకరణ ఒక్కటే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణంగాపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ, కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ యార్డులతో స్థానిక ప్రజలను ఒప్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ ఇతర నగర పాలక సంస్థల నుంచి రోజు వారీగా ప్రతిరోజు సుమారు 7611 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. వీటిని నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియకు ఎకువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువు, బయో గ్యాస్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం, పొడి చెత్తలో కాలే గుణం గల వ్యర్థాలను పోగు చేసి.. విద్యుత్ తయారీకి వినియోగిస్తున్నారు. జవహర్నగర్తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డంపింగ్ యార్డు వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి.. టీఎస్ఎస్పీడీఎల్ సమన్వయంతో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో: హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గత సర్కారు తీసుకున్న నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాయి. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు నగరానికి నలువైపులా నాలుగు (కన్స్ట్రక్షన్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ను గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నెలకొల్పారు.
తొలుత జీడిమెట్ల, ఫతుల్లాగూడలో వీటిని ఏర్పాటు చేయగా..ఆ తర్వాత తూంకుంట, శంషాబాద్ శాతంరాయిలో సీ అండ్ డీ ప్లాంట్లను నెలకొల్పారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజూ 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించి శుద్ధి చేస్తున్నారు. ఏడాది కాలంగా 2,54,561 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వివిధ ప్రాంతాల నుంచి ప్లాంట్లకు తరలించగా..అందులో 1,27, 571 టన్నుల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తీసుకొచ్చారు.
కాంక్రీట్ దిమ్మెలు, ఇటుక గోడలు, రాళ్లను , చెక్క, ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినీయం వంటి వస్తువులను నిర్వహణ కేంద్రాల్లోని యంత్రాల్లో వేయగానే తుక్కుతుక్కు అవుతాయి. నీటి ప్రవాహం వాటిలోని మట్టిని వేరు చేస్తుంది. సాంప్రదాయ ఇసుక, కంకరను పోలిన రెండు రకాల ఇసుక, రెండు రకాల కంకర బయటకు వస్తాయి. లోహాలు, కాగితం, ప్లాస్టిక్, మట్టి, తారు, చెక్క వేర్వేరుగా బయటకు వచ్చేస్తాయి. బంకమట్టిని సిమెంట్ తయారీకి, ఇసుక కంకరతో ఇటుకలు, పేవర్ బ్లాక్స్ వంటి వస్తువులను తయారు చేస్తున్నారు.