Land Grabbing | సిటీబ్యూరో: శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కోర్టు ఆదేశాలను ఆసరా చేసుకొని చెరువును ఆక్రమించేందుకు కట్టను తెగకొట్టారు. చెరువులో బండరాళ్ల డంపింగ్ చర్యలు చేపట్టారు. స్పందించిన జీహెచ్ఎంసీ లేక్ విభాగం అధికారులు.. బండరాళ్లను తొలగించి.. అన్యాక్రాంతం కాకుండా కాపాడారు.
సంబంధిత పట్టేదారులపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో గతేడాది జూలై 5న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సర్వే నంబర్ 71/1, 71/2 సంబంధించిన పట్టదారులు ట్యాంక్(చెరువు)బెడ్లోని భూమి తన ఆస్తి అంటూ పేర్కొంటూ.. హైకోర్టు ఆశ్రయించారు. సంబంధిత పట్టేదారులు ప్రకాశ్, రాజు ఎడ్లవానికుంట ప్రభుత్వ ఆస్తిని దెబ్బ తీసినందుకు జిల్లా కలెక్టర్కు జీహెచ్ఎంసీ అధికారులు నివేదిక అందించారు. కలెక్టర్ వారికి నోటీసు సైతం జారీ చేశారు. కాగా, ఎడ్లవానికుంట ఆక్రమణకు జరిగిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు.