సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే జీహెచ్ఎంసీ 5 శాతం రాయితీని ప్రకటించింది. ఇండ్లు, వ్యాపార సముదాయాల యాజమానులు ఈ నెల 30లోపు ఎర్లీబర్డ్ స్కీమ్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. ఈ 30 రోజుల్లో రూ.750 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ ఖరారు చేసింది. మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను రూపంలో రూ. 1681.72 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రోజు (మార్చి 31న) రాత్రి 11 గంటల వరకు చెల్లింపునకు అవకాశం ఇవ్వగా రూ. 64 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
గ్రేటర్ వాసులకు జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆసి ్తపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ను ఇళ్లు, వ్యాపార సముదాయాల యాజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించిన వారికే ఈ 5 శాతం రిబెట్ ఉంటుందని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ.741.35కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగా..ఈ సారి రూ. 750కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసింది.