దుండిగల్/జీడిమెట్ల, మార్చి 26 : వీధి వ్యాపారులపై జీహెచ్ఎంసీ విరుచుకుపడింది. రెక్కాడితే గానీ డొక్కాడనీ చిరు వ్యాపారుల బతుకులను ఆగం చేసింది. దాదాపు 400 కుటుంబాలను రోడ్డున పడేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్, షాపూర్నగర్ కూరగాయల మార్కెట్పై మంగళవారం అధికారులు ప్రతాపం చూపారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది వ్యాపార సముదాయాలపై దాడులకు దిగారు. 2017లో గుర్తించి, ఐడీ కార్డులు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి భరోసా కల్పించిన జీహెచ్ఎంసీ అధికారులే వారి పట్ల కక్ష సాధింపుగా చర్యలు తీసుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తాయి. ఇక్కడ విక్రయాలు కొనసాగిస్తున్న ప్రాంతం గ్రీన్ జోన్లో ఉన్నదని, ట్రాఫిక్కు సంబంధించి ఎటువంటి సమస్యలేదని గుర్తించి లైసెన్సులు ఇచ్చారని సంబంధిత వ్యాపారులు పేర్కొన్నారు. Officials of GHMC తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ దుకాణాలపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించి, తోపుడు బండ్లను విరగ్గొట్టి నానా హంగామా చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిని కాదని మాపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మొత్తంగా ఉన్నతాధికారి ఒకటి ఆదేశిస్తే.. కిందిస్థాయి అధికారులు అత్యుత్సాహంతో, తమకు ఈ వీధి వ్యాపారుల నుంచి ఆదాయం రావడం లేదనో, లేక మరో రకమైన భావజాలంతోనో వీధి వ్యాపారుల జీవితాలను చిందర వందర చేశారు.
రోడ్డును ఆక్రమించి వెలసిన దుకాణ సముదాయాలను తొలగించాలని ఉన్నతాధికారులు సూచించగా అత్యుత్సాహం ప్రదర్శించిన టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు ఏకంగా జేసీబీలతో తోపుడు బండ్లు, డబ్బాలను కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. అధికారుల చర్యలతో ఆగ్రహించిన చిరు వ్యాపారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు ధ్వంసం చేసిన తోపుడు బండ్లు, డబ్బాలను తిరిగి ఏర్పాటు చేసేంత వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బాధితులకు అండగా నిలిచారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. షాపూర్నగర్ మార్కెట్లో బాధితులను కలిసి పరామర్శించారు. సమస్య ఎలాచోటుచేసుకుందో వారితో చర్చించి తెలుసుకున్నారు. అనంతరం గాజుల రామారం ఉప కమిషనర్ మల్లారెడ్డిని కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముందస్తు సమాచారం లేకుండా వారి దుకాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకొని విధుల్లోంచి తొలగించాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. ఒకవేళ మార్కెట్ తీసేయాలి అనుకున్నప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలి లేదా ప్రభుత్వ పాలసీ ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా ఉన్నట్టుండి వారి జీవనోపాధిపై దెబ్బ కొట్టడం సరైన పద్ధతి కాదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా ఈ విషయంలో అత్యుత్సాహం చూపిన టౌన్ ప్లానింగ్ అధికారి సంగీత, శానిటేషన్ జవాన్ చందర్కు మెమోలు జారీ చేసినట్లు గాజులరామారం ఉప కమిషనర్ మల్లారెడ్డి తెలిపారు. వాస్తవానికి తాము ప్రధాన రహదారిలోని ఆక్రమణలు తొలగించాలని సూచిస్తే, అందుకు విరుద్ధంగా జేసీబీలతో కూరగాయాల మార్కెట్ రోడ్డులోని డబ్బాలు, తోపుడు బండ్లను తొలగించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
నోటీసులు ఇవ్వకుండానే తమ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం ఎంతవరకు సమంజసం. 30 ఏండ్ల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. ఏ అధికారి కూడా తమను ఇబ్బందులకు గురి చేయలేదు.
40 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. మొన్ననే రూ.50 వేల విలువ చేసే మట్టి పాత్రలు తీసుకొచ్చాను. ముందస్తు సమాచారం లేకుండా తన షెడ్డును కూల్చివేయడంతో సగానికి పైగా మట్టికుండలు ధ్వంసమయ్యాయి.