పట్టణ ప్రగతితో కాలనీలు మరింత అభివృద్ధి: కార్యక్రమంలో కార్పొరేటర్లు
బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్నగర్,జూన్ 6: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని శ్రీనికేతన్ కాలనీలో సోమవారం కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పర్యటించారు. కాలనీలో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పేరుకుపోయిన వ్యర్థాలను తరలించారు. కాలనీకి చెందిన పార్కులో యూబీడీ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
డివిజన్ పరిధిలో అత్యంత పరిశుభ్రమైన కాలనీల్లో ఒకటైన శ్రీనికేతన్ కాలనీలో పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ రజినీకాంత్, ఏఈ ఆనంద్, జలమండలి డీజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు అడిగి.. సూచనలుఇచ్చి..
పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి జాఫర్అలీ బాగ్లో పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మట్టికుప్పలు, వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు. సీవరేజీ సమస్యను పరిష్కరించారు. ఎలక్ట్రిసిటీ బంచ్ కేబుల్ వేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాటర్ వర్స్ మేనేజర్ మనోజ్ఞ, బల్దియా ఏఈ చరణ్, టీఎస్సీడీసీఎల్ ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు కృష్ణ, అఖిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం కృషి
బస్తీలు, కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట సర్కిల్-16 డీసీ వేణుగోపాల్, హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాల తెలిపారు. పట్ణణ ప్రగతిలో భాగంగా సోమవారం హిమాయత్నగర్, పైపులైన్బస్తీ,ఫరీద్బస్తీ,మల్లికార్జున నగర్ బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, లోప్రెషర్ మంచినీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ఉన్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకు రావ డంతో తక్షణమే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్య క్రమంలో నారాయణగూడ జలమండలి మేనేజర్ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఏఈ ఫరీద్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, నాయకులు సర్ఫరాజ్, అశోక్కుమార్, బీజేపీ నాయకులు జి.రామన్గౌడ్, జై స్వాల్,నర్సింగ్గౌడ్,జాకీ పాల్గొన్నారు.
భారీగా వ్యర్థాల తొలగింపు
పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం సోమాజిగూడ డివిజన్లోని అపరాజితకాలనీలో కార్పొరేటర్ వనం సంగీత నోడల్ అధికారి శ్రీనివాస్తో కలిసి పర్యటించి.. పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీలో భారీగా పేరుకుపోయిన చెట్ల కొమ్మల వ్యర్థాలను సిబ్బందితో తొలగింపజేశారు. కాగా, కార్పొరేటర్ కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకోగా, తాగునీటి ఇబ్బందిని ఆమె దృష్టికి తెచ్చారు.
హిమాయత్నగర్లో జరిగిన పట్టణ ప్రగతిలో పాల్గొన్న డీసీ వేణుగోపాల్
పట్టణ ప్రగతిలో భాగంగా సిబ్బందికి సూచనలిస్తున్న కార్పొరేటర్ విజయరెడ్డి