ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రూ. 11 కోట్ల 23 లక్షలు అందజేత
తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి
జూబ్లీహిల్స్,మార్చి 26 : మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపాయాలు కల్పించారు. స్వయం ఉపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు అర్భన్ కమ్యునిటీ డెవలప్మెంట్ విభాగం రూ.11 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. కాగా మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో లక్ష్యాన్ని దాటి బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలిచ్చారు.
200 స్వయం సహాయక సంఘాలకు రుణాలు
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విరివిగా రుణాలు ఇప్పించాం. ఈ ఏడాది యూసుఫ్గూడ సర్కిల్లో 200 గ్రూపులకు రూ.11 కోట్ల 23 లక్షల 85 వేల రుణ సదుపాయాలకు అందజేశామన్నారు.
అతి తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులు మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవచ్చు. స్వయం ఉపాధి కోసం ముందుకొచ్చే కొత్త గ్రూపులకు కూడా రుణ సదుపాయాలు కల్పిస్తాం. – ఎం.హిమబిందు, డిప్యూటీ పాజెక్ట్ ఆఫీసర్, యూసుఫ్గూడ సర్కిల్-19