సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వీధి కుక్కల బెడద నుంచి ప్రజలు సురక్షితంగా ఉండేలా జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు చేపట్టిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో అడిషనల్ కమిషనర్ రవికిరణ్, వెరట్నరీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై వీధి కుక్కల బెడద, కుక్క కాటు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం చర్చించారు.
ప్రజలకు రక్షణ కల్పించడానికి వెటర్నరీ శాఖ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్గా వ్యాక్సిన్ వేయాలని వెటర్నరీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వెరట్నరీ చీఫ్ డాక్టర్ అబ్దుల్ వకీల్, బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అక్కినేని అమల, కుమారి, పీఫుల్ యానిమల్స్ ప్రతినిధి వి.వాసంతి, కమెండో కెన్నల్స్ ఫిలిప్ బట్, యానిమల్ ఎయిడ్ సొసైటీ ప్రతినిధి అర్చననాయుడు తదితరులు పాల్గొన్నారు.