తప్పులు లేని ఓటరు జాబితా తయారే లక్ష్యంగా స్పెషల్ సమ్మరీ రివిజన్-2024ను నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. జనవరి 1 నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసేందుకు భారత ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించిందని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ -2024పై సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 1 వరకు ఈఆర్వోలు ఓటరు జాబితా, ఎపిక్ కార్డులో తప్పులు పరిశీలిస్తారని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, ఆరుగురు కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కుటుంబాలను అధికారులు రీ వెరిఫై చేస్తారని తెలిపారు. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8న ప్రచురిస్తామని తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా తప్పులు లేని ఓటరు జాబితా తయారుకు కృషి చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని, అందుకోసం జనవరి 1వ తేదీ నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసుకొనుటకు భారత ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై సమావేశం నిర్వహించారు. జనవరి 1వ తేదీ నుంచి https://ceotelangana.nic.in/ ఆన్లైన్ ద్వారా, ఆఫ్ లైన్లో సంబంధిత బీఎల్ఓలకు 18 సంవత్సరాలు నిండిన వారు ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేనివారు నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని రొనాల్డ్రాస్ తెలిపారు.
ఇందులో భాగంగా ఈఆర్ఓలు అబ్సెంట్, షిఫ్టెటెడ్, డూప్లికేట్, ఓటర్లను పరిశీలించి స్పష్టమైన ఓటరు జాబితా తయారు చేసేందుకు ఈఆర్ఓలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈఆర్ఓలు ఓటరు జాబితా ఆధారంగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటి నంబర్లను వెరిఫై చేస్తారని, ఒకే కుటుంబంలో ఆరు మంది కంటే ఎకువ ఓటర్లు ఉన్నచో వాటిని రీవెరిఫై చేస్తామని తెలిపారు.
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇతర పోలింగ్ కేంద్రాల్లో నమోదు అయిన ఓటర్లను, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను, ఫొటో మిస్ మ్యాచ్, ఇంటి నంబర్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఇంటి నెంబర్ వారీగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 11 వరకు 15 నియోజకవర్గాలలో వివిధ రకాల ఫారంల ద్వారా వచ్చిన దరఖాస్తులను కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ ప్రతినిధులు నందీష్ కుమార్, శివరాజ్ సింగ్, బీజేపీ నుంచి భరద్వాజ్, సీపీఐఎం ప్రతినిధి శ్రీనివాస రావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు జి.నిరంజన్, రాజేశ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కార్తీక్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి ముస్తాక్ తదితరులు పాలొన్నారు.