సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ) : ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్లోని సేవాలాల్ బంజారా భవన్లో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనీలకు, ఏఎల్ఎంటీఎస్ మాస్టర్ ట్రైనీలకు, స్పెషల్ ఆఫీసర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు రొనాల్డ్ రాస్ సూచించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రొసిడింగ్ అధికారులు, సహాయ ప్రొసిడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది సుమారు 34 వేల మందిని నియమించామన్నారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ రోజున పీఓ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమావళి ప్రకారం అనుసరించాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. తప్పని సరిగా తీసుకొని పోవాల్సిన సంబంధిత మెటీరియల్ను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా తీసుకొని.. వాటిని పరిశీలన చేసుకునే పద్ధతులు, పలు అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. తీసుకున్న ఎన్నికల పరికరాలు నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లాలని తెలిపారు.
చెబుతే..
పోలింగ్ రోజుకు ముందు మాక్ పోలింగ్ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించి, అనంతరం మాక్ పోల్ను సర్టిఫై చేయాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు పోలింగ్కు ముందు రోజు అకడ ఉండకుండా ఇంటికి పోయే వెసులుబాటు కల్పించారు. అయితే, పోలింగ్ రోజు ఉదయం 5 గంటల లోగా నేరుగా సంబంధిత పోలింగ్ స్టేషన్లో ఉండాలన్నారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. మాక్ పోలింగ్లో కనీసం ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు మాక్ పోలింగ్లో ఉండకూడదని రొనాల్డ్ రాస్ వివరించారు. ప్రొసైడింగ్ అధికారులు పోలింగ్ రోజు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. త్వరలో జరిగే ప్రొసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఫారం-12ను అందజేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ను ఇంటికి తీసుకెళ్లకుండా.. నేరుగా పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మహిళా పోలింగ్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 128 అనుసరించి సీక్రసీ ఆఫ్ ఓటింగ్లో భాగంగా ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదని రొనాల్డ్ రాస్ చెప్పారు. ఉల్లంఘించినచో మూడు నెలలు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని రొనాల్డ్ రాస్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓ ద్వారా ఓటరు హెల్ప్ లైన్ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కంపార్ట్ మెంట్లో సరైన లైటింగ్ ఉండాలని, సీక్రసీ ఆఫ్ ఓటును పాటించాలన్నారు. పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3 ద్వారా ఓటరు లిస్ట్ చదవడం, ఇంక్ వేయడం, ఓటరు పేరు నమోదు చేయడం లాంటి విధులు ప్రొసీడింగ్ అధికారులు కేటాయించాలన్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల నమోదుపై ఈవీఏం ద్వారా పరిశీలన చేసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది ఓటు నమోదు చేసిన మొత్తం కంట్రోల్ యూనిట్ ద్వారా పోలైన ఓట్లను సరి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలు పాటించి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. పోలింగ్ సందర్భంగా చెక్ ఓటు, టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటుపై నియమ నిబంధనలు పాటించి, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున అంధులు, బలహీనంగా ఉన్న ఓటర్లు తమ వెంట తెచ్చుకునే సహాయకులకు రైట్ హ్యాండ్లో ఇంకు మారు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటింగ్ సమయం ముగిసే సమయంలో క్యూలో నిలబడిన వాళ్లకు ఓటు హకు వినియోగించుకునే అవకాశం కల్పించాలని రోనాల్డ్రోస్ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని, సంబంధిత ఫిర్యాదులకు సత్వర పరిష్కారం దొరుకుతుందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన కొత్త సీ- విజిల్ యాప్లో ఫాస్ట్ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ, సత్వర పరిష్కారానికి ఈ యాప్.. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నా సెక్టోరల్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసిన తర్వాత ఏడు సెకన్లలో వివి ప్యాట్లో (ఓటరు వెరిఫికేషన్ పేపర్ అండ్ ఆడిట్ ట్రయల్) బీప్ సౌండ్ ద్వారా ఓటు నమోదు గుర్తించడం జరుగుతుందన్నారు. ఓటరు బ్యాలెట్ యూనిట్ (బీయూ) ద్వారా ఓటు వేసిన తర్వాత వివి ప్యాట్లో పేపర్ జనరేట్ కాకపోతే.. వెంటనే ఆర్ఓకు సమాచారమిచ్చి.. సంబంధిత బ్యాలెట్ యూనిట్ మార్పునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎకువ మంది పోటీలో ఉన్న పక్షంలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఆర్ఓలు, పీఓలు, సెక్టోరల్ ఆఫీసర్లు టీమ్ లాగా పని చేయాలని డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించామని, తదనుగుణంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. పోలింగ్ నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి, సునంద తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్వాడ్ ద్వారా బుధవారం రూ.16.38 లక్షల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ఫ్లయిండ్ స్వాడ్ ద్వారా ఇప్పటి వరకు రూ. 1,00,08,250 నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలీసు అథారిటీ ద్వారా రూ.4,28,73,433 నగదు సీజ్ చేయగా.. ఇప్పటి వరకు రూ. 23,70,08,115 నగదును సీజ్ చేసినట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్ ద్వారా ఇప్పటి వరకు 3,923 లైసెన్స్ ఆయుధాలను సేకరించామన్నారు. సీఆర్పీఎఫ్ 281 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 789 మంది బైండోవర్, 447 నకాస్ ఆపరేషన్స్ చేయడం జరిగిందన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్ కింద 351 కేసులు నమోదయ్యాయన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా బుధవారం 1591 లీటర్ల లిక్కర్ను సీజ్ చేయడం జరిగిందని వివరించారు.
సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్, అక్టోబర్18: స్పష్ట్టమైన ఓటరు జాబితా తయారీలో నిర్లక్ష్యం వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 225, 219 పోలింగ్ స్టేషన్ల బీఎల్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్, రిసోర్స్ పర్సన్పై క్రమశిక్షణ చర్యలు కోసం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. షిఫ్టింగ్ ఓటర్ల పరిశీలనలో అలసత్వం ప్రదర్శించిన ఈ ముగ్గురిపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన షోకాజ్ నోటీసులకు 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. 225 పోలింగ్ స్టేషన్లో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న బూత్ స్థాయి అధికారి ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్.రాజేందర్, సూపర్వైజర్గా పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినెట్, ఇన్చార్జి బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న బూత్ లెవల్ సూపర్వైజర్ను, అదేవిధంగా 215 పోలింగ్ స్టేషన్లో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్న ఇందిరాకు జూబ్లీహిల్స్ ఈఆర్వో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారిని టెర్మినెట్ చేసేందుకు సంబంధిత ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు.