సిటీబ్యూరో, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పాతబస్తీలోని ఆరు పురాతన కట్టడాలను శనివారం పరిశీలించారు. చెత్త బజార్ కమాన్, హుస్సేనీ ఆలం కమాన్, షేక్ ఫాయిజ్ కమాన్, దేవన్ దేవిడి కమాన్, డబీర్పుర కమాన్, రాణీగంజ్ కమాన్లను పరిశీలించి పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు ఈఎస్సీ జియావుద్దీన్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. గతంలో చార్మినార్ పెడస్ట్రీరియన్ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.60 కోట్లతో 13 పనులు చేపట్టడం జరిగినదని, అందులో ఆరు పనులు పూర్తి కాగా, మిగిలినవి అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ వారసత్వ సంపదను భావి తరాల వారికి అందించాలనే నేపథ్యంలో మూడు పురాతన హెరిటేజ్ భవనాల పునర్నిర్మాణం, పరిరక్షణకు రూ.18 కోట్ల వ్యయంతో మోజంజాహి మార్కెట్, మౌలాలి కమాన్, క్లాక్ టవర్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అంతే కాకుండా రూ.30 కోట్లతో ముర్గీచౌక్ పునర్నిర్మాణ పనులు, రూ.30 కోట్ల చేపడుతున్న సర్దార్ మహల్ పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ నాయక్, చార్మినార్ జోన్ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ ఈఈ శంకర్, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.