సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే జోనల్ కమిషనర్ల స్థానంలో మార్పులు జరగగా, తాజాగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరుపుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులలో సంబంధం ఉండి, మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, జూలై 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఈ బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ)గా కొనసాగుతున్న డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్ఓ)లుగా వ్యవహరించనున్నారు. కాగా, తాజా బదిలీల్లో డీసీలుగా ఉన్న నాగమణి, వేణుగోపాల్, ఎంకేఐ ఆలీ, మంగతాయారులను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సంబంధిత ఉత్తర్వులో కమిషనర్ పేర్కొన్నారు. నగర శివారులోని పోచారం, సంగారెడ్డి, నార్సింగి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్లు జీహెచ్ఎంసీలోని పలు సర్కిళ్లకు డీసీలుగా బదిలీ అయ్యారు. వీరితో పాటు మరో 18 మంది డీసీలను బదిలీ చేశారు.
కాప్రా సర్కిల్ డీసీగా ఉన్న ఎన్.శంకర్ను బేగంపేట డీసీగా బదిలీ చేశారు. బేగంపేట డీసీగా ఉన్న ముకుందరెడ్డిని చందానగర్కు బదిలీ చేశారు. చందానగర్ డీసీగా ఉన్న సుధాంశ్ను సికింద్రాబాద్ సర్కిల్ డీసీగా బదిలీ చేశారు. సికింద్రాబాద్లో ఉన్న టి.దశరథ్ను ఎల్బీ నగర్ సర్కిల్ డీసీగా, ఉప్పల్ డీసీగా ఉన్న అరుణ కుమారి చరణ్ను సరూర్నగర్ డీసీగా, హయత్నగర్ డీసీగా ఉన్న ఎ. మారుతి దివాకర్ను అంబర్పేటకు బదిలీ చేశారు. చార్మినార్ డీసీ ఎన్.సూర్య కుమార్ను అల్వాల్కు, రాజేంద్రనగర్ డీసీ డి.జగన్ను మెహిదీపట్నం సర్కిల్ డీసీగా బదిలీ చేశారు. కార్వాన్ డీసీ బి.శ్రీనివాస్ను ఉప్పల్కు బదిలీ చేయడంతో పాటు కాప్రా సర్కిల్కు ఎఫ్ఏసీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ డీసీ జి.రజనీకాంత్ రెడ్డిని శేరిలింగంపల్లికి, యూసుఫ్గూడ డీసీ ఏ.రమేష్ను మూసాపేట సర్కిల్కు బదిలీ చేశారు. అక్కడ ఉన్న కె.రవి కుమార్ను రాజేంద్రనగర్ డీసీగా బదిలీ చేశారు. రామచంద్రాపురం – పటాన్చెరు డీసీ డి. బాలయ్యను గోషామహల్కు, అక్కడ ఉన్న డి.డాకునాయక్ను చార్మినార్ డీసీగా నియమించారు. కూకట్పల్లి డీసీ పి.రవీంద్ర కుమార్ను హయత్నగర్కు బదిలీ చేశారు. గాజుల రామారం డీసీ వి.ప్రశాంతిని జూబ్లీహిల్స్కు బదిలీ చేశారు. ఎల్బీ నగర్ డీసీ హెచ్.కృష్ణయ్యను కూకట్పల్లి సర్కిల్కు బదిలీ చేశారు. శేరిలింగంపల్లి జోన్లో జాయింట్ కమిషనర్గా ఉన్న ఎల్పీ మల్లయ్యను గాజుల రామారం డీసీగా నియమించారు.
పోచారం మున్సిపల్ కమిషనర్గా ఉంటూ ఇటీవల జీహెచ్ఎంసీకి తిరిగి వచ్చిన ఏ.సురేష్ను రామచంద్రాపురం – పటాన్చెరు డీసీగా, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్గా ఉండి జీహెచ్ఎంసీ వచ్చిన మహ్మద్ యూసుఫ్ను కార్వాన్ డీసీగా, జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ను యూసుఫ్గూడ డీసీగా, నార్సింగి నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయిన సి. సత్యబాబును కుత్బుల్లాపూర్ డీసీగా నియమించారు.