సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కమిషనర్ స్థానిక శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి నాలా అభివృద్ధి , రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాకు పెద్ద పీట వేసిన్నందున అంతర్గత రహదారులు, నాలా అభివృద్ధి పనులకు విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీ సూచించిన పనులను అధికారులతో కలిసి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒవైసీ దవాఖాన నుంచి పోచారం వరకు అప్రోచ్ వీడీసీసీ రోడ్డు, దర్గా బరాని నుంచి అపోలో దవాఖాన, ఎంజీ రోడ్డుకు స్మార్ట్ వాటర్ డ్రైనేజీ, ఒవైసీ దవాఖాన నుంచి నాలా పనులు, హఫీజ్బాబా నాలా, రోడ్డు వెడల్పు పనులు, గుర్రం చెరువు నుంచి సన్ని నాలా వరకు రోడ్డు, బండ్లగూడ సూరారం చెరువు నుంచి బండ్లగూడ రోడ్డు వెడల్పు, పల్లె చెరువు నాలా పనులను చేపట్టాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కమిషనర్ను కోరారు. కమిషనర్ వెంట ఈఎస్సీ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ వెంకన్న, ఓఎస్డీ సురేశ్ కుమార్, ఈఈ సనా ఉద్దీన్, కార్పొరేటర్లు సయ్యద్ ముస్తఫా బేగ్, అబ్దల్ వహీద్, ఫాహద్ బిన్ అబ్దాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.