సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ) : ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు (డీఆర్సీ) ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్లతో కలిసి నగరంలోని పలు నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను రొనాల్డ్ రాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మొదటగా ఎల్బీస్టేడియంలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి డీఆర్సీలను సందర్శించి ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డీఆర్సీ కేంద్రానిన్ని ఏవీ కాలేజీలో ఏర్పాటుకు ప్రతిపాదించారు. నిజాం కాలేజీలో ఏర్పాటు చేసే చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల డీఆర్సీలను సందర్శించి ఏమైనా మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
గోషామహల్ నియోజకవర్గానికి కోఠి ఉమెన్స్ కాలేజ్లో డీఆర్సీ కేంద్రం, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసే చార్మినార్, సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయంలో ఏర్పాటు చేసే యాకత్ పుర నియోజకవర్గం డీఆర్సీ కేంద్రాలను తనిఖీ చేశారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసే నాంపల్లి నియోజకవర్గ డీఆర్సీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ మాసబ్ ట్యాంక్లో ఏర్పాటు చేసి కార్వాన్ నియోజకవర్గం డీఆర్సీ, సాంకేతిక విద్య భవన్లో ఏర్పాటు చేసే బహదూర్ పుర నియోజకవర్గం డీఆర్సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
అనంతరం ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ కోరారు.