సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/అత్తాపూర్: గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే జరిపించి..2640 చెత్త కుప్పలున్నట్లు తేల్చింది.. వాటిని నివారించేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తాజాగా కొత్తగా ట్రై సైకిళ్లు (రిక్షాలు), వీల్ బార్స్ (చిన్న ట్రాలీ)లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో రిక్షాను గరిష్ఠంగా రూ. 24,600కు కొనుగోలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు 1500 రిక్షాలు, మరో 1500 చిన్న ట్రాలీల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. ఇందుకు టెండర్ గడువు శుక్రవారం వరకు విధించారు. చెత్త కుప్పలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఈ నెల 5న బాధ్యతలు చేపట్టిన రోనాల్డ్ రోస్ ఒక వైపు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఎలక్ట్రికల్, శానిటేషన్, హౌజింగ్, టౌన్ప్లానింగ్, ఎలక్షన్ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన రోనాల్డ్ రోస్ పౌరులకు మెరుగైన సేవలే లక్ష్యంగా ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో మరిన్ని సంస్కరణలే లక్ష్యంగా ఆకస్మిక పర్యటనలు చేయాలని నిర్ణయించి, ఈ మేరకు బుధవారం రాజేంద్రనగర్లో పర్యటించారు. స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డ్రైవర్లతో పారిశుద్ధ్య నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల్లోపు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందా? రోడ్లపై వేసిన చెత్త కుప్పలను తీసుకెళ్తున్నారా? యాప్ విధానం అమలు ఎలా ఉంది? క్లీనింగ్ స్టేటస్ వివరాలను ఎస్ఎఫ్ఏ, స్వచ్ఛ సాతీలు ఉదయం 8.30 నుంచి 9 గంటల సమయంలో సంబంధిత మొబైల్ యాప్లో పొందుపరుస్తున్నారా ? అని అడిగారు. పౌరులు అందించే ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ జోనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో రోనాల్డ్ రోస్ ఆకస్మిక పర్యటనలు, ఫోన్ల ద్వారా ఆరా తీస్తున్నారు.