Ronald Rose | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలన్నారు. లౌడ్ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎవరైనా సభలో ఆటంకం కలిగించినా.. పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు బ్యాడ్జెస్, ఐడెంటిటీ కార్డులు కలిగి ఉండాలన్నారు. రాజకీయ నాయకులు పంపిణీ చేసే ఓటరు స్లిప్లో ఎలాంటి సింబల్ గానీ, పార్టీ గుర్తు గానీ ఉండకూడదని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారికి, జోనల్, సెక్టార్ మెజిస్ట్రేట్కు, సీఈవో, ఈసీఐకి ఫిర్యాదు చేయాలని రోనాల్డ్ రోస్ సూచించారు.
అంతేకాదు.. కుల, మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ప్రార్థనా స్థలంలో ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదని చెప్పారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించాల్సిందిగా సూచించారు. అఫిడవిట్లోని అన్ని కాలమ్స్ను తప్పనిసరిగా నింపాలని.. అభ్యర్థి నామినేషన్తో పాటు ఎలక్టోరల్ పేరు ఉన్న కాపీని జతచేయాలని రోనాల్డ్ రోస్ సూచించారు.