హైదరాబాద్ : నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతరులు సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించొచ్చు అని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం ఫోన్ నంబర్ – 040 2111 1111.
వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.