సిటీబ్యూరో, అక్టోబరు 13 (నమస్తే తెలంగాణ): పౌర సేవలను మరింత విస్తృతం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు కాల్ సెంటర్ 040-2111 1111, 100, జీహెచ్ఎంసీ యాప్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు అందుతుండగా జోనల్ అధికారులు వాటికి పరిష్కారం చూపుతున్నారు. అయితే విభాగాల మధ్య సమన్వయం.. గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులపై కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. రోజురోజుకూ సామాజిక మాధ్యమాల ద్వారా పెరుగుతున్న ఫిర్యాదుల తో పరిష్కారం జాప్యమవుతున్నది.
ఈ అపవాదు నుంచి జీహెచ్ఎంసీ బయటపడేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని.. ప్రస్తుత గ్రీవెన్స్ సెల్ను మరింత బలోపేతం చేయాలని ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, అన్ని విభాగాధిపతులతో కమిషనర్ లోకేశ్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రీవెన్స్ సెల్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంలో అడిషనల్ కమిషనర్లు కీలకంగా వ్యవహరించాలని.. అన్ని విభాగాలకు సంబంధించిన ముఖ్య అధికారులు నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇంజినీరింగ్, శానిటేషన్, ఈవీడీఎం, టౌన్ ప్లానింగ్, ప్రాజెక్టు ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించి పండుగ తర్వాత నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.