అనుమతులు లేని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ ఆదిలోనే చెక్ పెడుతున్నది. టీఎస్ బీ పాస్ ద్వారా నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభతరం చేసిన అధికారులు, నిబంధనల ఉల్లంఘనులపై తక్షణం చర్యలు చేపడుతున్నారు. నోటీసుల విధానానికి స్వస్తి పలికి టీఎస్ బీ పాస్ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తున్నారు. చట్టం అమల్లో భాగంగా ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు మంగళవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఏడు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్ సర్కిళ్లలో ఇప్పటి వరకు 21 భవనాలను కూల్చివేయడం గమనార్హం. – సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ ) :
అనుమతితో కట్టుకోండి : టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు రహదారులు, కాలిబాటల స్థలాలను ఆక్రమించకూడదు. నగరంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాకారం కావాలంటే పౌరులు సహకరించాలి. అనుమతితో భవనాలను కట్టుకోవాలి. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్, కంట్రోల్ రూం నంబరు 040-2111 1111, జీహెచ్ఎంసీ ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా అక్రమ నిర్మాణాలపై పౌరులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. టీఎస్ బీ పాస్ చట్టం నిర్మాణ అనుమతుల విధానాన్ని సులభతరం చేసింది. 75 గజాల్లోపు ఇండ్లకు రూ.1 కే నిమిషాల్లో అనుమతి పొందుతున్నారు. అంతకు మించిన విస్తీర్ణంలోనూ సులువుగా అనుమతులు మంజూరవుతున్నాయి. ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు.
దీనిలోనే అత్యధికంగా అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. 21 రోజుల వ్యవధిలోనే అనుమతులు పొందుతున్నారు. అయితే ఇందులో ముందుగా పేర్కొన్న ప్లాన్కు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టకపోవడం, అనుమతి లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం లాంటి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు.
గ్రేటర్లో ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందాలు రోజూ డివిజన్ల స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 150 డివిజన్లకుగానూ 75 మంది సహాయ ఇంజినీర్లు తనిఖీ అధికారులుగా ఉన్నారు. కొందరు ఒకే డివిజన్కు నియమితులవ్వగా, మరికొందరు రెండు లేదా మూడు డివిజన్లు చూస్తున్నారు. వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నారు. ఈ నివేదిక అధికారంగా అనుమతి లేని నిర్మాణాలపై ఆయా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.